బాధతో ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం: Bandi Sanjay Kumar

by Disha Web Desk 2 |
బాధతో ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం: Bandi Sanjay Kumar
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేవలం నలుగురు వ్యక్తుల కోసమే తెలంగాణ ఏర్పడినట్లుగా పరిస్థితులు మారాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. బీజేపీ మద్దతోనే తెలంగాణ ఏర్పడిందన్నారు. 1400 మంది బలిదానాలతో రాష్ట్రం సాధ్యమైందన్నారు. అనేక రంగాల్లో రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని, 9 ఏళ్ల కాలంలో కేంద్రం, రాష్ట్రానికి రూ.4 లక్షల కోట్ల నిధులు విడుదల చేసిందని వెల్లడించారు. రాష్ట్రంలో కేసీఆర్ మూర్ఖ త్వపు పాలన కొనసాగిస్తున్నారని బండి ధ్వజమెత్తారు.

రాష్ట్రం ఏర్పడిందనే సంతోషం తప్పా.. స్వరాష్ట్ర సాధన ఆకాంక్షలు మాత్రం నేటికీ నెరవేరలేదని సంజయ్ ధ్వజమెత్తారు. ఆవిర్భావ దినోత్సవాన్ని బాధతో జరుపుకుంటున్నట్లుగా సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఫీజు రీయింబర్స్ మెంట్ ముందుగానే చెల్లిస్తామని బండి హామీ ఇచ్చారు. ఉచిత విద్య, వైద్యం అందిస్తామని తెలిపారు. నిలువ నీడ లేని నిరుపేదలందరికీ ఇండ్ల నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పంట నష్టపరిహారం కింద రూ.10 వేలు ఇస్తానని ఇప్పటి వరకు అందించలేదని విమర్శలు చేశారు. ఆయన ఇవ్వరు.. ఇంకొకరిని ఇవ్వనివ్వరని బండి సంజయ్ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి రాగానే ఫసల్ బీమాను రాష్ట్రంలో అమలుచేసి రైతులకు భరోసా కల్పిస్తామని పేర్కొన్నారు. నోటిఫికేషన్ల పేరుతో సీఎం కాలయాపన చేస్తున్నారని విమర్శలు చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక కూడా నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకోవడం కంటే దుర్మార్గం ఇంకొక్కటి ఉందా అని బండి ప్రశ్నించారు.

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఆయా శాఖల వారీగా నిర్వహిస్తుండగా సీఎంవో నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను చదవాలని ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం బెదిరిస్తోందని, ఈ విషయాన్ని పలువురు ఉద్యోగులు తనకు కాల్ చేసి ఆవేదన వ్యక్తం చేశారని సంజయ్ తెలిపారు. 21 రోజులు రోజుకో డిపార్ట్ మెంట్ బీఆర్ఎస్‌కు ప్రచారం చేయాలని ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. బీఆర్ఎస్‌కు ప్రత్యా మ్నాయం బీజేపీ మాత్రమే అని ప్రజలు నమ్ముతున్నారని, అందుకే జీహెచ్ఎంసీ, దుబ్బాకలో బీజేపీకి పట్టం కట్టారన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగిస్తే.. కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా రాలేదన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు అభ్యర్థులు గల్లంతయ్యారని ఎద్దేవా చేశారు. అనేక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పత్తాలేకుండా పోయిందని చురకలంటించారు. కాంగ్రెస్‌ను లేపేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందని, అడ్డుకుంటే ఆగే పార్టీ తమది కాదని బండి హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధికి మోడీ సహకరించినా కేసీఆర్ దానికి సిద్ధంగా లేరన్నారు. బీజేపీని తట్టుకోలేక కేసీఆర్ టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి రాష్ట్రం దాటారన్నారు. గడీల పాలనను అంతమొందించడానికి బీజేపి ముందడుగు వేసిందన్నారు. ఒక కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణ తల్లిని విడిపించడానికి బీజేపీని రాష్ట్ర ప్రజలు ఆదరిస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.

Read More... ‘ఎందరో అమరుల త్యాగ ఫలం.. ఇంకెందరో బిడ్డల బలిదానం’


Next Story

Most Viewed